ఏయూ వీసీ రిజిస్ట్రార్లకు జెల్ల.. ఆగమేఘాల మీద ఆచార్య లావణ్య సస్పెన్షన్ ఉపసంహరణ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంటే ఘోరంగా వ్యవహరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్‌లకు గట్టి దెబ్బ తగిలింది.

Update: 2024-06-21 05:06 GMT

దిశా ప్రతినిధి, విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంటే ఘోరంగా వ్యవహరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్‌లకు గట్టి దెబ్బ తగిలింది. తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న భావనతో లేనిపోని ఆరోపణలతో గాజువాక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్ భార్య అయిన ఏయూ సహాయ ప్రొఫెసర్ లావణ్యను కౌంటింగ్‌కు ముందు సస్పెండ్ చేసిన వీరు నెల రోజుల తిరగకుండానే ఉపసంహరించుకున్నారు.

సస్పెండ్ చేసిన చేతులతోనే పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు భార్య డాక్టర్ లావణ్య దేవి ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో భర్తకు సహకారం అందించడానికి సెలవు పెట్టారు. ఆ సమయంలో పెదగంట్యాడలో పెంటమాంబ అమ్మవారి జాతర జరిగింది. దానికి భర్తతో కలిసి వెళ్లారు.

అక్కడ ఎన్నికల ప్రచారం చేశా రంటూ ఏయూ వీసీ ప్రసాదరెడ్డి బృందం కక్ష సాధింపు ధోరణితో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో ఆర్డీఓతో కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) విచారణ చేయించారు. అధికారులు కూడా వీసీ సూచనల మేరకు తప్పుడు నివేదికలను పంపించారు. ఆ నివేదిక వీసీకి పంపించారు. ఈ నేపథ్యంలో లావణ్య దేవిని రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ సస్పెండ్ చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆనాడే విమర్శలు వచ్చా యి.

వాటిని పట్టించుకునే అలవాటు లేని వీసీ, రిజిస్ట్రా ర్ లెక్క చేయలేదు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై మరోసారి విచారణ చేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదేశం మేరకు ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ, తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని అదే రిజిస్ట్రార్ స్టీఫెన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెండు రోజుల క్రితం పల్లా శ్రీనివాసరావు విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏయువీసీ ప్రసాద్ రెడ్డి చదువుకున్నా, ఆయనకు సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ చదువరులకు ఉండాల్సిన బుద్ధి జ్ఞానం లేవని ఘాటుగా విమర్శించారు.

అది జరిగిన రెండో రోజే భార్య సస్పెన్షన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. బీసీ ప్రసాద్ రెడ్డి సొంత విభాగమైన కంప్యూటర్ సైన్స్‌లో పనిచేసే లావణ్యను పలు రకాలుగా వేధింపులకు గురి చేసిన వీరు ఆమె ప్రమోషన్ కూడా తొక్కి పట్టారు.


Similar News