ఇదే దేవుని స్క్రిప్ట్.. వైఎస్ జగన్‌ కౌంటర్‌కు సీఎం చంద్రబాబు రీకౌంటర్..

నేటి స్థితిని చూసి మురవకు, రేపటి మర్మం తెలియదు రోజు మారే వరకు అన్నారు ఓ మాహానుభావుడు.

Update: 2024-06-20 12:04 GMT

దిశ వెబ్ డెస్క్: నేటి స్థితిని చూసి మురవకు, రేపటి మర్మం తెలియదు రోజు మారే వరకు అన్నారు ఓ మాహానుభావుడు. చులకనగా చూసిన చిత్తుకాగితమే గాలిపటమై ఎగిరితే తల ఎత్తి చూడాల్సి వస్తుంది. అలాంటిది రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచి అప్పటికే మూడుసార్లు రాష్ట్రానికి సీఎంగా సేవలందించిన నారా చంద్రబాబును అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనే విషయాన్ని మరిచి, అధికార దర్పంతో గర్వాన్ని ప్రదర్శించారు.

ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు అక్షరాల 23..

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తే.. టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అయితే ప్రజలు తమకు మేలు చేస్తారని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లిన జగన్ మొదటి రోజు నుండి ప్రతిపక్ష నేతలను గేలిచేయడమే పనిగా పెట్టుకున్నారని అప్పట్లో పలువురు విమర్శించారు. దీనికి కారణం ముఖ్యమంత్రిగా చట్ట సభలో ప్రజాసమస్యలపై ప్రస్తావించాల్సిన జగన్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటమిని ఎగతాలి చేయడమే.

నాడు 151 సీట్లను దక్కించుకున్నామనే గర్వంతో అప్పటి సీఎం జగన్ గౌరవప్రదమైన చట్ట సభను కురుసభగా మార్చారు. ప్రజల సమస్యలు ఏంటో తెలుసా అధ్యక్షా అనాల్సిన సీఎం, ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా అక్షరాల 23 సీట్లు, ముగ్గురు ఎంపీలను కొన్నవారికి వచ్చిన ఎంపీ సీట్లు ఎన్నో తెలుసా అక్షరాల 3, ఇంత గొప్పగా జరిగింది అంటే అది దేవుడు ఎంత గొప్పగా స్ర్కిప్ట్ రాస్తాడో చెప్పడానికి నిదర్శనం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసి, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండు కూడా చట్ట సభలో మళ్లీ ఈవేళ చూస్తున్నాం, అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా ఇవాల అందరం సమావేశమయ్యాం అని చంద్రబాబు ఓటమిని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

టిట్ ఫర్ ట్యాట్..

పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కారు. సమయం మనది కానప్పుడు ఎవరు ఏమన్నా సంయమనం పాటించడమే శ్రేయస్కరం. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమని చవి చూసిన చంద్రబాబు సైతం అప్పటి ముఖ్యమంత్రి ఎన్ని రకాలుగా అవమానించినా, ఆయన ఒటమిని ఎద్దేవా చేస్తూ, ఎమ్మెల్యేలను కొన్నారని అందుకే ఆ 23 సీట్లైనా వచ్చాయని, ఇది దేవుని స్ర్కిప్ట్ అని ఎంతగా అవమానించినా మౌనంగానే ఉన్నారు.

అయితే ఐదేళ్ల తరువాత నాడు దేవుని స్క్రిప్ట్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు రీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతి ఉద్యమం 1631 రోజులు జరిగింది. 1+6+3+1 కలిపితే వచ్చేది 11. జగన్‌కు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 11. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్.’ అంటూ నాడు జగన్ వ్యాఖ్యలకు నేడు ఘాటుగా రీకౌంటర్ ఇచ్చారు.


Similar News