AP Politics: సవాళ్ల సుడిలో నారా లోకేశ్.. తలపడి నిలబడగలరా..?

టీడీపీ మేనిఫెస్టో ప్రకారం ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి.

Update: 2024-06-08 05:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ మేనిఫెస్టో ప్రకారం ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. అది కేవలం ఒక్క ఐటీ రంగంలోనే అంటే సాధ్యం కాకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. పంటలు సాగు చేసే వాళ్ల దగ్గర భూమి లేదు. భూమి కలిగిన వాళ్లలో వ్యవసాయం చేసే తరం లేదు.

దాదాపు 75 శాతం కౌలు సాగు నడుస్తోంది. కౌలు రైతుల కష్టానికి ప్రతిఫలం గ్యారెంటీ లేనందున ఒకేడాది పంటలు సాగు చేసిన వాళ్లు నష్టాలు తట్టుకోలేక మరుసటి ఏడాది అర్బన్‌లో భవన నిర్మాణ కార్మికులుగా మారిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయాత్మక పాత్ర పోషించి సమస్యను పరిష్కరిస్తే సుమారు 20 లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

వైసీపీ నిర్లక్ష్యం, నిధుల కొరత..

వైసీపీ సర్కారు పెండింగ్​ ప్రాజెక్టులను అసలు పట్టించుకోలేదు. నీటిపారుదల రంగంలో పనులను చేపట్టాలంటే నిధులతో కూడుకున్న పని. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సాధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. వాటర్​ గ్రిడ్​ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికీ సురక్షిత మంచినీటిని అందిస్తామని పాదయాత్రలో లోకేశ్ హామీ ఇచ్చారు. దీనికీ నిధులు కొరత ఉంది.

ఉపాధితో కూడిన అభివృద్ధి అవసరం..

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచవచ్చు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు జిల్లాలవారీ ఏఏ రంగాల్లో పరిశ్రమలకు అనువుగా ఉంటుందో ఓ ప్రణాళికను రూపొందించారు. రాజధాని నిర్మాణం హడావుడిలో దీన్ని పట్టించుకోలేకపోయారు. ఆయా రంగాలకు సంబంధించి ఊతమిస్తే జిల్లాల్లో వలసలు ఆగి ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం సహకారం అనివార్యం..

ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూనే ఇవన్నీ చేపట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సంక్షేమం, అభివృద్ధి రైలు పట్టాలు మాదిరిగా సాగాలంటే నిధుల లభ్యత కీలకం. ఆదాయ వనరుల పెంపు మీద దృష్టి సారించాలి. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టాలి. ప్రభుత్వ నిర్వహణలో దుబారాను అరికట్టాలి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్​శాఖల మంత్రిగా లోకేశ్​ వీటన్నింటినీ బ్యాలెన్స్​ చేసుకొని సాగడంలో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సామర్థ్యానికి ఇదో గీటురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.


Similar News