కొత్త మిషన్‌కు రెడీ.. శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో

Update: 2023-09-27 17:06 GMT

న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్‌ను ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో లక్ష్యంపై దృష్టి సారించింది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన వీనస్‌ (శుక్రుడు)పైకి భారతదేశ మిషన్‌‌ను కాన్ఫిగర్ చేసినట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధృవీకరించారు. ఈ మిషన్ కోసం పేలోడ్స్ ఇప్పటికే అభివృద్ధి చేయబడగా.. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయి కానుంది.

తాజాగా ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ప్రసంగిస్తూ ఇస్రో చీఫ్ ఈ వివరాలను వెల్లడించారు. సంస్కృత పదాలైన శుక్ర (శుక్రుడు), యానా (క్రాఫ్ట్, వాహనం) ఆధారంగా అనధికారికంగా శుక్రయాన్ అని పిలువబడే ఈ మిషన్.. రాబోయే సంవత్సరాల్లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. చాలా మందంగా, ఆమ్లాలతో నిండి ఉండే వీనస్ ఉపరితలం, వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రాథమిక ఉద్దేశ్యం. అయితే శుక్రుడిపై వాతావరణ పీడనం.. భూమి కంటే 100 రెట్లు ఎక్కువ కాగా, ఇది అన్వేషణకు సవాల్‌గా మారే అవకాశం ఉంది. వీనస్‌ను అధ్యయనం చేయడం వల్ల మన సొంత గ్రహ భవిష్యత్తుపై కీలకమైన అంతర్దృష్టులు లభిస్తాయని సోమనాథ్ అన్నారు.

Similar News