పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి యూపీ కోర్టు కీలక ఆదేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జులై 2న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-06-26 14:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జులై 2న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, 2018లో బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ నేపథ్యంలో 'భారత్ జోడో యాత్ర' లో భాగంగా నగరానికి వచ్చినప్పుడు ఫిబ్రవరి 20న రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్‌ పొందారు.

అయితే తాజాగా ఈ కేసులో రామ్ ప్రతాప్ అనే వ్యక్తి తనను పార్టీగా చేర్చుకోవాలని అభ్యర్థించగా, ప్రతాప్ బాధితుడేమీ కాదని, ఈ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, కేసును ఆలస్యం చేసేందుకు పిటిషన్‌ దాఖలు చేశారని విజయ్ మిశ్రా తరపున న్యాయవాది సంతోష్‌ పాండే ఆరోపించారు. కాగా, గాంధీ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా రాహుల్‌ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణలో రాహుల్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

మరోవైపు రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు కూడా పెండింగ్‌లో ఉంది, దీనికి బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 30న తిరిగి ప్రారంభమవుతుంది.


Similar News