Giriraj Singh : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడి

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ గిరిరాజ్ సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

Update: 2024-08-31 17:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ గిరిరాజ్ సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా బలియా సబ్ డివిజన్‌లో నిర్వహించిన జనతా దర్బార్‌ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తి పేరు మహ్మద్ షహ్జాదుజ్జమా అని.. అతడు బలియాలోని ఒక వార్డుకు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. జనతా దర్బార్ కార్యక్రమం ముగిశాక కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వేదిక పైనుంచి దిగుతుండగా మహ్మద్ షహ్జాదుజ్జమా సహా కొందరు వ్యక్తులు ఎదురుగా వెళ్లారు.

ఈక్రమంలోనే షహ్జాదుజ్జమా తన చేతిలో ఉన్న వినతి పత్రాలను కేంద్ర మంత్రికి చూపించగా.. ‘‘నేను మీ ఎంపీని కాను’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన మహ్మద్ షహ్జాదుజ్జమా, కేంద్రమంత్రి గిరిరాజ్‌కు చెంపదెబ్బ కొట్టేందుకు యత్నించినట్లు సమాచారం. ఈక్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ స్పందిస్తూ.. ‘‘నాపై దాడి చేసిన వ్యక్తికి గడ్డం ఉంది. అతడి గడ్డాన్ని చూసి తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తారేమో. అలాంటి వాళ్లకు నేను భయపడను. బలియా, బెగూసరాయ్, పరిసర ప్రాంతాల్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూనే ఉంటాను’’ అని వెల్లడించారు. 


Similar News