Bihar: పాట్నాతో పాటు మరో మూడు నగరాల్లో క్రాకర్స్‌ను నిషేధించిన బీహార్ ప్రభుత్వం

దీపావళి సందర్భంగా అన్ని నగరాల్లో గాలి నాణ్యతను కాపాడాలని ఎన్‌జీటీ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది

Update: 2024-10-24 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాట్నాతో పాటు మరో మూడు నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని రకాల టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. గురువారం పాట్నా జిల్లా యంత్రాంగం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాట్నాతో పాటు గయా, ముజఫర్‌పూర్, హాజీపూర్‌లలో అన్ని రకాల టపాసుల అమ్మకం, వాడకాన్ని నిషేధించడం జరిగింది. దీపావళి సందర్భంగా అన్ని నగరాల్లో గాలి నాణ్యతను కాపాడాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. టపాసులు పేల్చడం వల్ల గాలి, శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. అవి విషపూరిత కారకాలు, ధూళిని విడుదల చేస్తాయి. అవి ప్రజల కళ్లు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె, చర్మాన్ని దెబ్బతీయవచ్చని యంత్రాంగం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర పట్టణాల్లో దీపావళి రోజున గ్రీన్ లేదా పర్యావరణ అనుకూల క్రాకర్స్‌కు మాత్రమే అనుమతులు ఉంటాయి. ఎన్‌జీసీ ఆదేశాల ప్రకారం నాలుగు నగరాల్లో క్రాకర్ల అమ్మకానికి లైసెన్స్ ఇవ్వడం కుదరదని జిల్లా అధికారి వెల్లడించారు. 

Tags:    

Similar News