Wayanad: ప్రియాంకకు మద్దతుగా యూడీఎఫ్ ప్రచారం

వయనాడ్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రియాంకకు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించింది.

Update: 2024-10-19 05:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగారు. అయితే, కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రియాంకకు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ సమావేశాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు కే. సుధాకరన్, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి సహా ప్రముఖులు పాల్గొంటారు. అయితే, అక్టోబర్ 25 నాటికి అన్ని పంచాయతీ ఎన్నికల కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు భావిస్తున్నారు. అగ్ర నేతల నేతృత్వంలో ఈ నెల 26, 27 తేదీల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు.

ఉపఎన్నికలు..

ఇకపోతే, రాహుల్ గాంధీకి మద్దతు పలికిన వయనాడ్ ప్రజలు మరోసారి ప్రియాంక గాంధీకి చారిత్రాత్మక మెజారిటీ కట్టబెట్టడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు, భారత ఎన్నికల సంఘం ఇటీవల 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Similar News