న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం చేసిన రైడ్స్ పై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇప్పటివరకు ఆప్ నేతల నివాసాలపై 1000 సార్లు సోదాలు జరిపినా.. ఒక్క పైసా కూడా అక్రమమని తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేంద్ర సర్కారు ఈడీతో ఇలాంటి సోదాలు చేయిస్తోందని దుయ్యబట్టారు.
‘‘గతంలో ఎవరి ఇంట్లోనూ ఏమీ దొరకలేదు. ఇప్పుడు సంజయ్ సింగ్ నివాసంలోనూ వారికి ఏమీ దొరకదు. ఓటమికి దగ్గరైనప్పుడే ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే’’ అంటూ బీజేపీపై పరోక్షంగా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ‘‘ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీబీఐ, ఈడీ, ఐటీ, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలు మరింత యాక్టివ్గా పనిచేస్తాయి. అంతకుముందు జర్నలిస్టులపై దాడులు చేశారు. ఇప్పుడు సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సోదాలు జరుగుతాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.