మోడీ ప్రమాణస్వీకారానికి వస్తున్నట్లు ధృవీకరించిన విదేశీ నేతలు

వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుక జూన్ 9 ఆదివారం రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది.

Update: 2024-06-08 07:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుక జూన్ 9 ఆదివారం రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. మంత్రి మండలి కూడా ప్రధానమంత్రి కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానాలను పంపింది. ఆహ్వానాలను అందుకున్న విదేశీ అథితులు వారి రాకను ధృ‌వీకరించారు. వారు ఈ వేడుకలో పాల్గొనడానికి ఆదివారం ఢిల్లీకి చేరుకుంటారు. భారత అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ వంటి ప్రధాన హోటళ్లు ఇప్పటికే గట్టి భద్రతను కలిగి ఉన్నాయి

అయితే ఈ వేడుకకు రాబోతున్న అతిధులు ఎవరో ఒకసారి చూద్దాం.. శ్రీలంక అధ్యక్షుడు-రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు-డాక్టర్ మహ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు-అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని-షేక్ హసీనా, మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాన మంత్రి-పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధానమంత్రి-షెరింగ్ టోబ్గే.

బంగ్లాదేశ్‌ ప్రధాని, సీషెల్స్‌ అధ్యక్షుడు శనివారం న్యూఢిల్లీకి రానుండగా, మిగతా నేతలంతా ఆదివారం దేశ రాజధానికి వస్తారు. నేపాల్ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి నాలుగు గంటల ముందుగా న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుండి వేదిక వద్దకు తిరిగి రావడానికి నిర్దేశిత మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడంతో పాటు, అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో ఈ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉన్నత స్థాయి పరస్పర చర్యలు, చర్చలను సులభతరం చేస్తుంది.


Similar News