సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో 10,000 రైల్వే కోచ్‌లు

వందే భారత్ వంటి రైళ్లను భారీ స్థాయిలో పట్టాలెక్కిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ, ఈ సారి సామాన్య ప్రజలపై దృష్టి పెట్టింది.

Update: 2024-07-05 08:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వందే భారత్ వంటి రైళ్లను భారీ స్థాయిలో పట్టాలెక్కిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ, ఈ సారి సామాన్య ప్రజలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వారి కోసం నాన్-ఏసీ కోచ్‌లను పెంచడానికి ప్రణాళికలు చేస్తుంది. 2024-25, 2025-26 సంవత్సరాల్లో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలను రూపొందించిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రైల్వే నెట్‌వర్క్ ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతుంది. సామాన్య ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో వారి అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ను తీర్చడానికి కొత్తగా నాన్-ఏసీ కోచ్‌లను అందించాలని ప్రభుత్వం చూస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 4,485 నాన్-ఏసీ కోచ్‌లను, 2025-26లో మరో 5,444 ఉత్పత్తిని పెంచే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అధికారి తెలిపారు. అదనంగా, రైల్వే తన ‘రోలింగ్ స్టాక్ సామర్థ్యాన్ని’ పెంచడానికి 5,300 కంటే ఎక్కువ సాధారణ కోచ్‌లను రూపొందించాలని యోచిస్తోంది.

ప్రస్తుతం, రైల్వే 2,605 జనరల్ కోచ్‌లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది, ఇందులో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేక అమృత్ భారత్ జనరల్ కోచ్‌లు ఉన్నాయి. వీటితో పాటు, 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు, 323 ఎస్‌ఎల్‌ఆర్ (సిట్టింగ్-కమ్-లగేజ్ రేక్) కోచ్‌లు, అమృత్ భారత్ కోచ్‌ల కోచ్‌లు, 32 హై కెపాసిటీ పార్శిల్ వ్యాన్‌లు, 55 ప్యాంట్రీ కార్లు కూడా ఉన్నాయి.


Similar News