కళ్లకురిచి కల్తీ మద్యం ఘటనలో 63కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

Update: 2024-06-27 06:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బుధవారం మరో నలుగురు మృతి చెందడంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 63కు చేరుకుంది. బుధవారం కొత్తగా నమోదైన మరణాల్లో ఎన్ రంజిత్‌కుమార్(26), ఎస్ సరసు (52), వి ఏసుదాసు(35), పి రామనాథన్ (62) అనే నలుగురు ఉన్నారు. వీరంతా కూడా కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురానికి చెందిన వారు.

ఈ ఘటనలో మొత్తం 225 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు. వారిలో 74 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి కాగా, ఇంకా 88 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ( NHRC ) ఈ దుర్ఘటనను సుమోటాగా స్వీకరించి వారంలోగా వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోరింది.

మరోవైపు మద్రాసు హైకోర్టు ఇలాంటి ఘటనలను కట్టడి చేయడానికి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును 10 రోజుల సమయం కోరగా, నివేదికను దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు జులై 3 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నైలో అన్నాడీఎంకే నేతలు, సభ్యులు గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) పళనిస్వామి, ఇతర సీనియర్ నేతలు దీనిలో పాల్గొన్నారు. వారు ఈ ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News