తండ్రి ఓటమికి స్వీట్ రివేంజ్ తీర్చుకున్న యంగెస్ట్ ఎంపీ

ఆ ఓటమిని ఆయన కుమారుడు పుష్పేంద్ర సరోజ్ జీర్ణించుకోలేకపోయాడు

Update: 2024-06-05 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణంగా రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉంటాయి. ఎన్నికలు మారుతున్న ప్రతిసారి ఒకరిపై ఒకరు విజయం సాధించడం అనేది రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా కనిపించే అంశం. అలాంటివి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ పలు చోట్ల జరిగాయి. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి నియోజకవర్గం కూడా. 2019లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఈ స్థానానికి ఐదుసార్లు ఎమ్మెల్యే, యూపీ కేబినెట్‌లో మాజీ మంత్రి అయిన ఇంద్రజీత్ సరోజ్ పోటీలో నిలబడ్డారు. అయితే బీజేపీ అభ్యర్థి వినోద్ కుమార్ సోంకర్ చేతిలో ఆయన 38 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమిని ఆయన కుమారుడు పుష్పేంద్ర సరోజ్ జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఐదేళ్ల తర్వాత ఇదే స్థానం నుంచి 25 ఏళ్ల పుష్పేంద్ర సరోజ్ బరిలో నిలబడి వినోద్ కుమార్ సోంకర్‌పై గెలవడమే కాకుండా ఏకంగా లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడించి మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇది రాజకీయాల్లో అరుదుగా జరిగే స్వీట్ రివేంజ్ స్టోరీ.

తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న పుష్పేంద్ర సరోజ్ ఇప్పుడు భారత్‌లోనే అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు, అత్యధిక మెజారిటీతో గెలిచిన అతి పిన్న వయస్కుడైన ఎంపీ కూడా. ఈ విజయంపై స్పందించిన అతను.. 'మా నాన్న 2019లో ఈ సీటు నుంచి పోటీ చేసి వినోద్ కుమార్ సోంకర్ చేతిలో ఓడిపోయారు. ఈసారి నేను పోటీలో నిలబడ్డాను. ఎన్నికల ప్రచారంలో.. గత ఎన్నికల్లో నీ తండ్రిని ఓడించాను. ఈసారి నిన్ను కూడా ఓడిస్తానని వినోద్ కుమార్ సోంకర్ అన్నారు. ఆ వ్యాఖ్యలతో నా విజయాన్ని ప్రజలు తమ బాధ్యతగా తీసుకున్నారని' చెప్పారు. 2019లో నా తండ్రి ఓడిపోయినప్పుడు రాజకీయాల్లో రావాలని అనుకున్నాను. అప్పుడు నాకు చిన్న వయసే. 2024లో నాకు 25 నిండుతాయని తెలుసు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయమై మా పార్టీ అద్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కలిశాను. నాతో మాట్లాడిన తర్వాత ఆయన మా నాన్న స్థానంలో పోటీ చేయమని సూచించారు. అక్కడి నుంచి తాను నియోజకవర్గంలో కీలక అంశాలు, ప్రజల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించి ఎన్నికల్లో పోరాడాను. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పరీక్షా పత్రాల లీక్ లాంటి అంశాలపై ప్రశ్నించాను. నన్ను నమ్మి ప్రజలు ఓటు వేశారు. అందుకు యూపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అఖిలేష్ యాదవ్ నా నుంచి ప్రధాన సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించే తత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే విజయం సాధించగలిగానని పుష్పేంద్ర సరోజ్ అన్నారు.

నిజానికి ఇంకా తాను విజయాన్ని జీర్ణించుకోలేదు. పార్లమెంటులో నాకు ఓటు వేసిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి. వారు నాపై నమ్మకం ఉంచారు. అందుకే రెండు రికార్డులతో కూడిన విజయాన్ని అందించారని అతను చెప్పాడు. 


Similar News