Subhankar Sarkar: బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా శుభాంకర్ సర్కార్‌.. ప్రకటించిన ఏఐసీసీ

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్‌ నియామకమయ్యారు.

Update: 2024-09-21 19:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్‌ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆయన పేరును ఖరారు చేసినట్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి సేవలను పార్టీ అభినందిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సర్కార్ గతంలో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది. దీంతో ఆయన ఏఐసీసీ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపకపోవడంతో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


Similar News