2040 నాటికి చంద్రునిపైకి భారతీయుడు.. 'సూర్య'ను రెడీ చేస్తున్న ఇస్రో

గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మళ్లీ చంద్రునిపై దృష్టి సారిస్తోంది.

Update: 2024-06-29 14:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మళ్లీ చంద్రునిపై దృష్టి సారిస్తోంది. అయితే ఈ సారి నేరుగా మానవులను అక్కడికి పంపాలని యోచిస్తోంది. దీనికోసం 'సూర్య' అనే కొత్త రాకెట్‌ను నిర్మిస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ప్రముఖ మీడియాతో అన్నారు. ఇది ఇప్పుడున్న వాటి కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ (LEO) పేలోడ్ సామర్థ్యం 40 టన్నులకు పైగా ఉంటుంది, ఇది మానవ అంతరిక్ష యాత్రలకు చాలా అవసరం. 2040 నాటికి భారతీయుడిని చంద్రునిపైకి పంపేందుకు 'సూర్య' కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ అయిన 'శివశక్తి' పాయింట్ నుండి భూమికి చంద్రుని నమూనాలను తీసుకురావడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు, రాబోయే కొన్నేళ్లలో ఇది జరగుతుందని సోమనాథ్ మీడియాతో చెప్పారు. చైనా కూడా ఈ వారం ప్రారంభంలో చంద్రుని నుండి మొట్టమొదటి మట్టి నమూనాలను భూమికి తిరిగి తీసుకువచ్చింది.

2035 నాటికి భారతదేశం తన అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని మోడీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించగా, దీని గురించి ప్రస్తావిస్తూ, 2028 నాటికి అంతరిక్ష కేంద్రం మొదటి దశను నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రభుత్వ ఆమోదం కోసం తమ బృందం పూర్తి ప్రాజెక్టు నివేదిక, వ్యయ అంచనాను రూపొందించిందని ఇస్రో చీఫ్ అన్నారు. రోబోటిక్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించడానికి అంతరిక్ష కేంద్రాన్ని మొదట రూపొందిస్తామని ఆయన చెప్పారు.

Similar News