వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం.. ఆలయంలో తుపాకీతో మహిళ
జమ్మూలోని (Jammu) ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి (Vaishno Devi shrine) ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూలోని (Jammu) ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి (Vaishno Devi shrine) ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ వద్ద ఆయుధాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను ఢిల్లీ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న జ్యోతి గుప్తాగా పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్డ్ తుపాకీని ఆమె ఆలయంలోకి తీసుకువచ్చారని, మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనతో ఆలయానికి వచ్చే భక్తులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ఆయుధంతో ఆమె ఆలయంలోకి ప్రవేశించేవరకు భద్రతా సిబ్బంది గుర్తించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.