నీట్ ఓఎంఆర్ షీట్ అవకతవకలపై రెండు వారాల తర్వాత విచారించనున్న సుప్రీంకోర్టు
ఇప్పటికే పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఎలా ఉత్తర్వులు జారీ చేస్తామని పిటిషనర్ను ప్రశ్నించింది.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పరీక్షల్లో అవతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. సోమవారం జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఏ విధమైన ఉత్తర్వులనైనా జారీ చేసేందుకు నిరాకరిస్తూ రెండు వారాల తర్వాత విచారించనున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఎలా ఉత్తర్వులు జారీ చేస్తామని పిటిషనర్ను ప్రశ్నించింది. అదే సమయంలో మళ్లీ పరీక్షకు ఆదేశిస్తే, మరో సమస్య ఎదురు కావొచ్చని స్పష్టం చేసింది. నీట్ పరీక్షకు హాజరైన పిటిషనర్ తరఫు న్యాయవాది శబరీష్ రాజన్.. తన పిటిషనర్ ఓఎంఆర్ షీట్ను మార్చినట్టు ఆరోపించారు. అయితే ఈ కేసును వచ్చే వారం వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ పరీక్షల్లో తానే టాపర్ అని పిటిషనర్ తెలిపారు. ప్రతివాదులు తన ఓఎంఆర్ షీట్ మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఒక కాపీని అందజేసినట్టు పేర్కొన్నారు. కాగా, మొదట సుప్రీంకోర్టు దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని భావించినప్పటికీ ఎన్టీఏ తరపు న్యాయవాది రెండు వారాల పాటు వాయిదా వేయాలని కోరడంతో అందుకు అనుమతించింది.