RG Kar Case: కోల్ కతా హత్యాచారం కేసులో సీబీఐ కీలక రిపోర్టు
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata Doctor Case) కేసులో సీబీఐ కీలక రిపోర్టులను వెల్లడించింది. కోల్ కతా ఘటనలో గ్యాంగ్ రేప్ జరగలేదని పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata Doctor Case) కేసులో సీబీఐ కీలక రిపోర్టులను వెల్లడించింది. కోల్ కతా ఘటనలో గ్యాంగ్ రేప్ జరగలేదని పేర్కొంది. రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేసిన కేంద్ర ఏజెన్సీ.. సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీటును సమర్పించింది. కోల్ కతా పోలీసు శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే సంజయ్ రాయ్ ఒక్కడే లైంగికవేధింపులకు పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు అందులో పేర్కొంది. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మరెవరైనా అనుమానితులు ఉన్నారా, గ్యాంగ్ రేప్ జరిగిందా అనే కేసు దర్యాప్తులో ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు
ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ హత్యాచారం జరిగింది. ఆర్జీ కర్ హాస్పిటల్ లోని సెమినార్ రూమ్లో నిద్రించేందుకు వెళ్లిన ఆమె తెల్లారేసరికి విగతజీవిగా కన్పించింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో సీబీఐ విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఆసుపత్రికి తరచూ వచ్చే సంజయ్ రాయ్ను కోల్కతా పోలీసులు ఘటన జరిగిన ఒక రోజు తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐకి కేసుని అప్పగించిన తర్వాత సంజయ్ రాయ్ కి సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించారు.