Omar Abdullah : ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి తీర్మానం అదే

జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసే తొలి తీర్మానం గురించి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-09 05:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసే తొలి తీర్మానం గురించి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని తీర్మానం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. జమ్ముకశ్మీర్ ని ఢిల్లీతో పోల్చవద్దని సూచించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదని గుర్తుచేశారు. 2019 వరకు జమ్ముకశ్మీర్ రాష్ట్రంగా ఉందని అన్నారు. అయితే, జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు చెప్పారని అన్నారు. జమ్ముకశ్మీర్ లో నియోజకవర్గాలు పునర్విభజన, ఎన్నికలు,రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయని కాషాయపార్టీ నేతలు చెప్పారని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ హవా

ఇకపోతే, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. మొత్తం 42 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఇదివరకే ప్రకటించారు. కాగా, అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్సీకి 42, కాంగ్రెస్ కు 6, సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ మొత్తం 29 స్థానాల్లో గెలిచింది.

Similar News