Rashid: ఎంపీ ఇంజనీర్ రషీద్కు ఊరట.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి
ఉగ్రవాద నిధుల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న ఎంపీ ఇంజనీర్ రశీద్కు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద నిధుల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (Engineer Rashid)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High court) ఊరట కల్పించింది. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రస్తుత సెషన్లో పాల్గొనడానికి ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. అయితే రషీద్ ఈ టైంలో మీడియాతో మాట్లాడటం, ఇంటర్నెట్తో సహా మొబైల్ ఫోన్ను ఉపయోగించడంపై నిషేధం విధించింది. పార్లమెంటుకు హాజరయ్యే అన్ని రోజుల్లో పోలీసులు రషీద్ను పార్లమెంటుకు తీసుకెళ్లి మళ్లీ జైలుకు తీసుకురావాలని న్యాయమూర్తులు చంద్రధారి సింగ్, అనుప్ జైరామ్ భంభానీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కోర్టు నిర్ణయం అనంతరం ఆయనను పోలీసులు పార్లమెంటుకు తీసుకొచ్చి మళ్లీ జైలుకు తీసుకెళ్లారు.
మార్చి 10న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తనకు కస్టడీ పెరోల్ నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రషీద్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్టు అయింది. కాగా, 2017లో రషీద్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నారని ఆరోపణలున్నాయి.అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలులో ఉండగానే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.