Ransomware attack: ర్యాన్సమ్‌వేర్ దాడితో నిలిచిపోయిన 300 బ్యాంకుల సేవలు

సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఈ దాడి వల్ల ఆయా బ్యాంకుల చెల్లింపుల కార్యకలాపాలు మూతపడ్డాయి.

Update: 2024-07-31 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓ టెక్నాలజీ సేవలందించే కంపెనీపై ర్యాన్సమ్‌వేద్ దాడి కారణంగా దాదాపు 300 చిన్న భారతీయ బ్యాంకుల చెల్లింపు సేవలు తాత్కాలిక నిలిపేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్‌లను అందించే సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఈ దాడి జరిగినట్టు సమాచారం. దానివల్ల ఆయా బ్యాంకుల చెల్లింపుల కార్యకలాపాలు మూతపడ్డాయి. ఖాతాదారులు ఏటీమ్‌లలో నగదు తీసుకోలేకపోయారు. అంతేకాకుండా యూపీఐ సేవలను కూడా ఉపయోగించలేకపోయారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన సీ-ఎడ్జ్‌పై ఆధారపడిన సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. దీనిపై తక్షణం స్పందించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ముందుజాగ్రత్తగా రిటైల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయకుండా సీ-ఎడ్జ్‌ని తాత్కాలికంగా వేరుగా ఉంచింది. అనంతరం సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి వల్ల కొన్ని సిస్టమ్‌లపై ప్రభావం ఉంటుందని ప్రకటించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారని పేర్కొంది. ప్రక్రియ సజావుగా జరిగితే గురువారం ఉదయం నాటికి అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. 

Tags:    

Similar News