Parliament Session: లోక్ సభలో వయనాడ్ ప్రమాదంపై చర్చ.. ఎంపీలు ఏం అన్నారంటే?
లోక్సభలో వయనాడ్ కొండచరియలు ఘటనపై ప్రతిపక్ష నేతలు మాట్లాడారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభలో వయనాడ్ కొండచరియలు ఘటనపై ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "మంగళవారం తెల్లవారుజామున వయనాడ్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసం జరిగింది. 70 మందికి పైగా మరణించారు. ముండకై గ్రామం తెగిపోయింది. ప్రాణ, ఆస్తినష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. రెస్క్యూ, వైద్యం కోసం సాధ్యమైన సాయాన్ని అందించాలని రక్షణమంత్రి, కేరళ సీఎంతో మాట్లాడా. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం వెంటనే విడుదల చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా కీలకమైన రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. బాధితుల పునరావాసం కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయండి” అని అన్నారు.
లోక్ సభలో ఏమన్నారంటే?
వయనాడ్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. "ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ప్రాణనష్టం పెరగొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. వీలైంత త్వరగా సహాయకచర్యలు చేపట్టాలి” అని అన్నారు. వయనాడ్, జార్ఖండ్ ప్రమాదాలపై అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'ప్రతి రంగంలోనూ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పేపర్ లీక్ల సంఖ్యపై కూడా రికార్డు సృష్టించబోతోంది. సేఫ్టీ, సెక్యూరిటీ, భారీ బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఉత్తరాఖండ్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి? అని అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని అడిగారు.