హత్రాస్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను కలిసిన రాహుల్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు

Update: 2024-07-05 05:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ కార్యక్రమానికి తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, దీంతో ఇది తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇది బాధాకరమైన సంఘటన. ఈ తొక్కిసలాటలో చాలా మంది మరణించారు. దీనిని రాజకీయం చేయదలచుకోలేదు. పరిపాలన పరంగా లోపాలతోనే ఇది జరిగింది. బాధితులు అంతా కూడా పేదవారు కాబట్టి నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాహుల్ చెప్పారు. శుక్రవారం ఉదయం రాహుల్ ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో అలీఘర్‌‌కు చేరుకుని అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడి, అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత హత్రాస్‌కు వెళ్ళి బాధితులను పరామర్శించారు.

రాహుల్ గాంధీ వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకుడు డానిష్ అలీ మాట్లాడుతూ యూపీ ప్రభుత్వం ఈ విషాదాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. ఇది దురదృష్టకర సంఘటన, మేము రాహుల్‌తో కలిసి బాధితులను కలుసుకున్నాము. వారి బాధలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై అంతగా దృష్టి సారించలేదని అన్నారు. మంగళవారం హత్రాస్‌‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.


Similar News