PM Modi : మహిళలపై నేరాలు ఆందోళనకరం : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Update: 2024-08-31 14:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళలు, బాలలపై జరిగే దాడి ఘటనలపై వేగంగా దర్యాప్తును పూర్తి చేసి శిక్షలు విధించాలన్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా శనివారం ఢిల్లీలోని భారత్‌ మండపంలో జిల్లా న్యాయవ్యవస్థలపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈసందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. మహిళలకు భద్రత కల్పించేందుకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఇప్పటికే చాలా చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. ‘‘2019లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు చట్టాన్ని పాస్‌ చేశాం. దాని అమల్లో భాగంగా సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటుచేశాం. ఇలాంటి అంశాల్లో జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి. ఫలితంగా వారి భద్రతకు భరోసా లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి వివరించారు.

క్రిమినల్ కోడ్ చట్టాలను దేశానికి అందించాం..

‘‘ఈ అమృత్‌కాల్‌ సమయంలో 140 కోట్ల మంది దేశ ప్రజలు అభివృద్ధి చెందిన, సరికొత్త భారత్‌ను చూడాలని ఆశిస్తున్నారు. ఈ విజన్ సాకారం కావాలంటే మనకు బలమైన న్యాయవ్యవస్థ కూడా అవసరం’’ అని ప్రధాని మోడీ తెలిపారు. కేసుల విచారణలో జాప్యాన్ని తొలగించేందుకు గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ‘‘న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లను గత పదేళ్లలో ఖర్చు చేశాం. గత 25 ఏళ్లలో ఇందుకోసం చేసిన ఖర్చులో దాదాపు 75 శాతం గత పదేళ్లలోనే జరిగింది’’ అని ప్రధాని తెలిపారు. బ్రిటీష్ వలస కాలపు భావజాలానికి చరమగీతం పాడేందుకు సరికొత్త క్రిమినల్ కోడ్ చట్టాలను దేశానికి అందించామన్నారు. ఎమర్జెన్సీ కాలంలోనూ దేశ ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించిందని మోడీ కొనియాడారు. జాతీయ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పోషిస్తున్న పాత్ర ఎనలేనిదన్నారు.

స్మారక స్టాంప్, నాణెం విడుదల..

ఈ కార్యక్రమం సందర్భంగా సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలకు గుర్తుగా ఒక స్మారక స్టాంప్, నాణెంను ప్రధానమంత్రి విడుదల చేశారు. జిల్లా న్యాయవ్యవస్థలపై జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, భారత అటార్నీ జనరల్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాల జ్యుడీషియరీల సభ్యులు 800 మందికిపైగా పాల్గొంటున్నారు.


Similar News