PARAM Rudra : మూడు ‘పరం రుద్ర’ సూపర్ కంప్యూటర్లు విడుదల

దిశ, నేషనల్ బ్యూరో : శాస్త్ర, సాంకేతిక విభాగంలో భారత్ మరో ముందడుగు వేసింది.

Update: 2024-09-26 15:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : శాస్త్ర, సాంకేతిక విభాగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం)లో భాగంగా అభివృద్ధి చేసిన మూడు ‘పరం రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.130 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ మూడు సూపర్ కంప్యూటర్లను పూణే (మహారాష్ట్ర), కోల్‌‌కతా (పశ్చిమ బెంగాల్), ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పలు పరిశోధనా సంస్థలు వినియోగించుకోనున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. టెక్నాలజీ, కంప్యూటింగ్ పరిజ్ఞానంపై ఆధారపడని రంగమంటూ ప్రస్తుతం లేదన్నారు.

‘‘సాంకేతిక విప్లవం రెక్కలు తొడిగిన ప్రస్తుత యుగంలో మన వాటా బిట్స్, బైట్స్‌కు పరిమితం కావొద్దు. అది టెరా బైట్స్, పెటా బైట్స్‌ స్థాయిలో ఉండాలి. అందుకే ఈ మన దేశం మరో మూడు సూపర్ కంప్యూటర్లను సిద్ధం చేసింది’’ అని ప్రధాని వివరించారు. వాస్తవానికి గురువారం రోజు సూపర్ కంప్యూటర్ల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోడీ పూణే పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అయితే భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దయింది. దీంతో ఆయన వర్చువల్‌గా సూపర్ కంప్యూటర్లను ప్రారంభించారు.


Similar News