తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ఎంత తగ్గాయంటే?

Update: 2024-03-14 17:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ‘‘పెట్రోలు, డీజిల్‌‌ ధరలను లీటరుపై రూ.2 తగ్గించడం ద్వారా కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని మోడీ మరోసారి నిరూపించుకున్నారు’’ అని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. ‘‘గురువారం(మార్చి 14) నాటికి వివిధ దేశాల్లో పెట్రోల్ ధరలను(రూపాయల్లోకి కన్వర్ట్ చేసి) చూసుకుంటే భారత్‌లో లీటరు పెట్రోల్ ధర సగటున రూ.94గా ఉండగా, ఇటలీలో మాత్రం అత్యధికంగా రూ.168గా ఉంది. భారత్‌తో పోలిస్తే ఇది 79శాతం అధికం. అలాగే, ఫ్రాన్స్‌లో రూ.166.87 (78శాతం ఎక్కువ), జర్మనీలో రూ.159.57 (70శాతం), స్పెయిన్‌లో రూ.145 (54శాతం)గా ఉంది. ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే చమురు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి’’ అని వివరించారు. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.89.62గా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి రూ.87.62కు తగ్గనుంది. లీటర్ పెట్రోల్‌ ధర రూ.96.72గా ఉండగా, అది రూ.94.72కు దిగిరానుంది. అలాగే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.104.21, డీజిల్ ధర రూ.92.15కు లభించనుంది.



Similar News