షాకింగ్.. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడు మృతి
ఎయిరిండియా విమానంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఎయిరిండియా (Air India) విమానంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ (Delhi) నుంచి లక్నో (Lucknow) వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రనికి చేరుకుంది. అయితే, ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సిబ్బంది సీట్లు శుభ్రం చేసేందుకు వెళ్లారు. అయితే, ఓ సీటులోని వ్యక్తి ఎలాంటి చలనం లేకుండా పడి ఉండడం గమనించారు.
వెంటనే విమానంలో ఉన్న వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. అయితే, విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహారం కూడా అలాగే ఉండటం, సీటు బెల్టు కూడా తీయకపోవటంతో గాల్లో ఉన్న సమయంలోనే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించారు. మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి, అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.