‘ఆపరేషన్ అజయ్’ షురూ.. ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది.
న్యూఢిల్లీ : హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 230 మంది భారతీయులతో కూడిన మొదటి ప్రత్యేక విమానం గురువారం రాత్రి ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు బయలుదేరనుంది. ఈ విమానం శుక్రవారం ఉదయం భారత్కు చేరుకుంటుంది. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా భారతీయుల ప్రయాణ ఖర్చులను కేంద్రమే భరించనుంది.
ఆపరేషన్ అజయ్ సన్నద్ధతపై భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుంది. ఇజ్రాయెల్తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ సమర్థిస్తుంది’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు.