న్యూఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరగడానికి కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని 'లా కమిషన్' పేర్కొంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశంపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో 'లా కమిషన్' సభ్యులు భేటీ అయ్యారు. మరిన్ని సమావేశాలు, సంప్రదింపుల తర్వాతే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై తుది నివేదికను సమర్పించగలమని.. తమకు ఇంకా సమయం అవసరమని 'లా కమిషన్' స్పష్టం చేసింది. 2024, 2029 సంవత్సరాల్లో ఏ టైంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలనే టైమ్ లైన్లతో కూడిన నివేదికను 'లా కమిషన్' సిఫార్సు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ మీటింగ్లో జమిలి ఎన్నికల నిర్వహణతో ముడిపడిన రాజ్యాంగ సంబంధిత అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. పోక్సో యాక్ట్లోని శృంగార సమ్మతి వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించవచ్చా..? లేదా..? అనే దానిపైనా డిస్కస్ చేశారు. అయితే ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖకు 'లా కమిషన్' ఎలాంటి సిఫార్సు చేస్తుందనే దానిపై గురువారంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎఫ్ఐఆర్ లను ఆన్లైన్లో దాఖలు చేయడానికి చట్టం అవసరమా..? కాదా..? అనే దానిపై లా కమిషన్ కేంద్రానికి రెకమెండేషన్ చేయనుంది.