బీజేపీకి నేతాజీ మునిమనవడి రాజీనామా..

Update: 2023-09-06 17:06 GMT

కోల్ కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను చేరిన లక్ష్యం నెరవేరలేదని.. అందుకు బీజేపీ సహకరించలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. అయితే తనకు సహకారం అందలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో ఆరోపించారు.

బీజేపీ వేదికగా ‘ఆజాద్ హింద్ మోర్చా’ను ఏర్పాటు చేసి నేతాజీ భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తొలుత తనకు అనుమతి ఇచ్చిన బీజేపీ.. ఆ తర్వాత మాట తప్పిందని మండిపడ్డారు. 2016లో పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన చంద్రకుమార్ బోస్ ను.. 2020లో చేపట్టిన పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా ఆ పదవి నుంచి తొలగించారు.


Similar News