National Green Tribunal: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు.. కారణమిదే?
మీర్జాపూర్ డివిజన్లోని అటవీ భూమిలో నిర్మాణాలను నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను
దిశ, నేషనల్ బ్యూరో: మీర్జాపూర్ డివిజన్లోని అటవీ భూమిలో నిర్మాణాలను నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు మిర్జాపూర్ థర్మల్ ఎనర్జీ యూపీ ప్రయివేట్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది. అదానీ పవర్కు చెందిన అనుబంధ సంస్థ ఇతర భూములను ఆక్రమించడమే గాక. అటవీ భూమిలో అక్రమంగా గోడలు, రోడ్ల నిర్మాణాలను ప్రారంభించినట్టు ఆరోపణలున్నాయి. దీంతో 2016 డిసెంబర్ 21న మీర్జాపూర్లోని దాద్రీ ఖుర్ద్ గ్రామంలో బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి పవర్ కంపెనీ వెల్స్పన్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్కు పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వడానికి గ్రీన్ ట్రిబ్యునల్ నిరాకరించింది.
స్థానికులు, పర్యావరణం, జీవనోపాధిని కాపాడేందుకు పలు నియమాలు నిబంధనలు పాటించాలని సూచించింది. కోర్టు ఆదేశించినప్పటిటీ కంపెనీ తన పనిని ఆపలేదని స్థానికులు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తాజాగా ఆ రూల్స్ ఉల్లంఘించారని కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల ఎన్జీటీ బెంచ్ ఆదేశాల తర్వాత.. మీర్జాపూర్ జిల్లా పరిపాలన కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తమ అనుమతి లేకుండా తమ భూమిని బలవంతంగా నమోదు చేశారని ఆరోపించారు. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్కు మెమోరాండం అందజేశారు. కంపెనీ తమ భూమిని ఎలా లాక్కుందో వివరిస్తూ ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు లేఖలు రాశారు.