'డ్రగ్స్ సప్లైని కట్టడి చేయడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్'.. రాజ్యసభకు తెలిపిన కేంద్రం
2021 నాటి గుజరాత్లోని ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసులో 2,988 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం
న్యూఢిల్లీ : 2021 నాటి గుజరాత్లోని ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసులో 2,988 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఈ హెరాయిన్ లోడ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు కంటైనర్లలో ముంద్రా పోర్ట్కు వచ్చిందని చెప్పారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నాలుగు చార్జిషీట్లను దాఖలు చేసి, 27 మంది నిందితులను అరెస్టు చేసిందన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కుమార్ కేత్కర్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలను వెల్లడించారు.
ముంద్రా పోర్ట్లో దిగిన మూడు డ్రగ్స్ కంటైనర్ల వ్యవహారంలో ప్రధాన నిందితుడిని ప్రభుత్వం గుర్తించిందా అని కేత్కర్ అడిగిన ప్రశ్నకు.. మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. ఓడరేవుల ద్వారా డ్రగ్స్ సప్లైని కట్టడి చేయడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని మంత్రి చెప్పారు. సముద్ర మార్గాల ద్వారా మాదకద్రవ్యాల రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు 2022 నవంబర్లో జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (NSCS)లో ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.