ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలి..మరోసారి నిరసనలకు ఎస్కేఎం పిలుపు
ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, రుణమాఫీ సహా పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్ల సాధనకు మరోసారి ఆందోళనలను తిరిగి ప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, రుణమాఫీ సహా పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్ల సాధనకు మరోసారి ఆందోళనలను తిరిగి ప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రికి, లోక్సభలో ప్రతిపక్ష నేతకు త్వరలోనే మెమోరాండం అందజేస్తామని తెలిపింది. ఎస్కేఎం నేతలు సమావేశమైన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన విడుదల చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి సంతకం చేసిన డిసెంబర్ 9, 2021 నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను తిరిగి ప్రారంభించాలని సాధారణ సభ నిర్ణయించినట్టు’ ఎస్కేఎం పేర్కొంది. ఆగస్టు 9న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ‘క్విట్ ఇండియా డే’ని ‘కార్పొరేట్స్ క్విట్ ఇండియా డే’గా పాటిస్తామని వెల్లడించింది. కాగా, ఇటీవల కూడా రైతు సంఘాలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.