Mayawati: రిజర్వేషన్ల రద్దుకు కాంగ్రెస్ కుట్ర: బీఎస్పీ చీఫ్ మాయవతి

రిజర్వేషన్లపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయవతి స్పందించారు.

Update: 2024-09-10 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్లపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి స్పందించారు. రిజర్వేషన్లను అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అణగారిన వర్గాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాలో ఇటీవల రాహుల్ చేసిన కామెంట్స్ ఒక డ్రామా అని ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని, కుల గణన సైతం చేపట్టలేదని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని విమర్శించారు.

భవిష్యత్‌లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన నిర్వహించలేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని , రిజర్వేషన్లను కాపాడుతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని రక్షించే నెపంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఖచ్చితంగా అంతం చేస్తుందని వెల్లడించారు. కాగా, యూఎస్‌లోని ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ భారత్ న్యాయమైన ప్రదేశంగా ఉన్నప్పుడు రిజర్వేషన్ల రద్దు పై ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మాయవతి పై వ్యాఖ్యలు చేశారు. 


Similar News