ఇంఫాల్: మణిపూర్ హింసాకాండలో దాదాపు 50,000 మందికిపైగా నిరాశ్రయులయ్యారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ ఆర్కే రంజన్ వెల్లడించారు. వారంతా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 349 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని ఆదివారం తెలిపారు. హింసాకాండ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మిలిటెంట్లను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ వారంలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో 53 ఆయుధాలు, 39 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు మొత్తంగా 990 ఆయుధాలు, 13,526 మందుగుండు సామగ్రిని మిలిటెంట్లు ప్రభుత్వానికి సరెండర్ చేశారని మంత్రి రంజన్ తెలిపారు. ఈ ఘర్షణల కారణంగా చదువులు డిస్టర్బ్ అయిన విద్యార్థుల కోసం రోడ్ మ్యాప్ను రూపొందించామని, త్వరలోనే దాన్ని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ధరల నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.