Mallikarjun Karge: దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు.. మల్లికార్జున్ ఖర్గే
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన దేశంలో ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన దేశంలో ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలు కూడా దీనిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముంగిట జిమ్మక్కులు చేస్తుందని విమర్శించారు. జమిలీ ఎన్నికలు నిర్వహణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ, అమిత్ షాలకు మాత్రమే అవసరం: అసదుద్దీన్ ఓవైసీ
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని, అంతేగాక రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం అయిన ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగిస్తుందని తెలిపారు. ఇది మోడీ అమిత్ షాలకు మాత్రమే అవసరమని విమర్శించారు. ఎందుకంటే వారు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి వారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.