Kolkata : నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలపై దీదీ సీరియస్
దిశ, నేషనల్ బ్యూరో : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఎన్నో విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే ఈ అంశాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు హౌరా, బంకురా, మిడ్నాపూర్లోని పలు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వాటిని ఆదేశించింది.
పాఠశాలల నిర్వాహకులు నిరసనల పేరుతో విద్యార్థులను రోడ్లపై తిప్పుతూ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈ నోటీసుల్లో బెంగాల్ విద్యాశాఖ ఆరోపించింది. దీనిపై ఆయా పాఠశాలల నిర్వాహకుల వాదన మరోలా ఉంది. తాము పాఠశాలల సమయంలో నిరసన తెలపలేదని, స్కూల్స్ టైం ముగిశాకే నిరసన తెలిపామని వారు అంటున్నారు. నిరసనల్లో తమ పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారని చెబుతున్నారు.