బీజేపీ సీనియర్ నేత సంచలన నిర్ణయం.. మంత్రి పదవికి రాజీనామా
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తూర్పు రాజస్థాన్ ప్రాంత బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈ ప్రాంతంలోని ఒక్క లోక్సభ స్థానంలో బీజేపీ ఓడిపోయినా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ప్రచారం వేళ కిరోడి లాల్ మీనా చెప్పారు. అయితే ఎన్నికల్లో తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో కిరోడి లాల్ మీనా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని.. ఇకపై తాను మంత్రి పదవిలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన పదిరోజుల క్రితమే రాజీనామా లేఖను సీఎం భజన్లాల్ శర్మకు అందించినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం వారించినా.. కిరోడి లాల్ మీనా అందుకు అంగీకరించలేదని సమాచారం. ఇప్పటివరకు రాజస్థాన్ క్యాబినెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, విపత్తు నిర్వహణ, సహాయ, పౌర రక్షణశాఖలకు మంత్రిగా కిరోడి వ్యవహరించారు.