Hijab Row : ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రకటించి.. అంతలోనే వెనక్కి తీసుకొని..

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేళ కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-05 17:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేళ కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కుందాపూర్ ప్రభుత్వ ప్రీ గ్రాడ్యుయేషన్ కాలేజీ ప్రిన్సిపల్‌ను తొలుత రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా కర్ణాటక విద్యాశాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కుందాపూర్ ప్రభుత్వ ప్రీ గ్రాడ్యుయేషన్ కాలేజీ ప్రిన్సిపల్‌కు పురస్కారం ఇవ్వడం లేదని ప్రకటించింది. రెండేళ్ల క్రితం బీజేపీ హయాంలో హిజాబ్ నిషేధాన్ని సదరు కాలేజీ ప్రిన్సిపల్ పకడ్బందీగా అమలు చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఓ వర్గం విద్యార్థులు, సంఘాలు నిరసనలకు దిగాయి.

‘‘హిజాబ్ విషయంలో ఆ ప్రిన్సిపల్ గతంలో విద్యార్థినులతో వ్యవహరించిన శైలిని పరిగణనలోకి తీసుకోకుండానే తొలుత ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆనాటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు పురస్కారం ఇవ్వకూడదని మేం నిర్ణయించాం’’ అని కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు. ఓ వర్గం వారిని ప్రసన్నం చేసుకోవడానికే సీఎం సిద్ధరామయ్య సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ, వీహెచ్‌పీ నేతలు మండిపడ్డారు.


Similar News