కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ వర్మ

హత్యాచారానికి బలైన కోల్ కతా ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైద్యుల, ప్రజల ఆందోళనలు, నిరసనలకు తలొగ్గిన బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా కొత్త పోలీస్‌ కమిషనర్‌ గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ వర్మ ను నియమించింది

Update: 2024-09-17 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : హత్యాచారానికి బలైన కోల్ కతా ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైద్యుల, ప్రజల ఆందోళనలు, నిరసనలకు తలొగ్గిన బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా కొత్త పోలీస్‌ కమిషనర్‌ గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ వర్మ ను నియమించింది. ఈ మేరకు బెంగాల్‌ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు కోల్‌కతా సీపీగా ఉన్న వినీత్‌ గోయల్‌ను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న వైద్యుల అభ్యర్థన మేరకు వినీత్‌ గోయల్‌ను విధుల నుంచి తప్పించింది. అటు వైద్య శాఖకు చెందిన పలువురు అధికారులను కూడా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారి స్థానంలో కొత్త అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు మమతా ప్రభుత్వం అంగీకరించింది. నాలుగుసార్లు ప్రభుత్వంతో చర్చల ప్రక్రియకు నిరాకరించిన జూనియర్‌ వైద్యులు, ఆఖరి ప్రయత్నంగా ఐదోసారి అందిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు డిమాండ్లలో మూడింటికి మమతా సర్కార్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలతో ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. 


Similar News