మోడీ సేనకు షాక్.. ‘ఇండియా’ కూటమి కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-06-05 17:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగానూ మోడీ ఓడిపోయారని విమర్శించారు. ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో భేటీ అయ్యాయి. ఈసందర్భంగా కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ‘ఇండియా’ కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో బాగా పోరాడాయని ప్రశంసించారు.

ఏయే పార్టీలు పాల్గొన్నాయి ?

ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, శరద్‌ పవార్‌ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), సంజయ్‌ రౌత్ (శివసేన-ఉద్ధవ్‌), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), చెంపయీ సోరెన్‌ (జేఎంఎం), రాఘవ్‌ చద్దా (ఆప్‌), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్‌పీ), కల్పనా సోరెన్‌ (జేఎంఎం) సహా పలువురు నేతలు పాల్గొన్నారు.


Similar News