ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం.. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు..
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ : విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ వెల్లడించారు. ప్రస్తుత సెమిస్టర్ నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందన్నారు. మిగతా పరీక్షలన్నీ యథాతధంగా జరుగుతాయని చెప్పారు. "ఇంతకుముందు మేం ఒక సెమిస్టర్లో రెండు సెట్ల మిడ్ పరీక్షలు నిర్వహించే వాళ్లం. ప్రతి సెమిస్టర్ చివరిలో ఫైనల్ పరీక్ష తో పాటు ఇంకా అనేక మూల్యాంకన విధానాలు ఉండేవి. అయితే దీనిపై మేము అంతర్గత సర్వే నిర్వహించాము. అందరు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక సెట్ మిడ్సెమిస్టర్ పరీక్షలను నిలిపివేయాలని నిర్ణయించాము. కాబట్టి ఇకపై రెండు సెట్లపరీక్షలు మాత్రమే ఉంటాయి" అని రంగన్ బెనర్జీ వివరించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులపై పరీక్షల భారం గణనీయంగా తగ్గనుంది. స్టూడెంట్స్ మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు కౌన్సెలింగ్ అందించడం, మెంటార్లను నియమించడం వంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నామని చెప్పారు.