Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్(Gwalior)లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఏసీ పేలిపోయి.. మంటలు చెలరేగాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్(Gwalior)లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఏసీ పేలిపోయి.. మంటలు చెలరేగాయి. ఆస్పత్రి వ్యాప్తంగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. గజ్ర రాజా మెడికల్ కాలేజీకి చెందిన కమలా రాజా హాస్పిటల్ గైనకాలజీ విభాగంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఏసీ పేలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఐసీయూ నుండి 13 మందితో సహా 190 మందికి పైగా రోగులను రక్షించి వేరే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి గార్డులు వెంటనే కిటికీలు పగలగొట్టి ఐసీయూలో చేరిన రోగులను రక్షించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారని గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ తెలిపారు. మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి రోగులను బయటకు తరలించారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. గ్వాలియర్ మున్సిపల్ కార్యాలయ అధికారి అతిబల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఆస్పత్రి లేబర్ రూమ్(Labor room)లో మంటలు అంటుకున్నాయని తనకు సమాచారం రాగానే, తాను ఈ విషయాన్ని ఫోనులో అగ్నిమాపకశాఖకు తెలియజేశానన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారన్నారు.