Himachal Pradesh : హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు..117 రోడ్లు మూసివేత

హిమాచల్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-13 14:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 117 రోడ్లను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) పేర్కొన్న దాని ప్రకారం, సిమ్లాలో గరిష్టంగా 81 రోడ్లు, మండిలో 21, కాంగ్రాలో 10, కులులో మూడు, బిలాస్‌పూర్, సిర్మౌర్ జిల్లాలో ఒక్కొక్కటి మూసివేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

మరోవైపు రాష్ట్రంలో సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఆకస్మిక వరదలు రావచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధికారుల ప్రకారం, జూన్ 27 నుండి సెప్టెంబర్ 12 వరకు వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలతో 165 మంది మరణించారు, ఇంకా 30 మంది గల్లంతయ్యారు. రాష్ట్రానికి రూ.1,323 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.

రాష్ట్ర వాతావరణ అధికారులు పేర్కొన్న దాని ప్రకారం, జూన్ 27న హిమాచల్‌ప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటి వరకు రాష్ట్ర వర్షపాతం లోటు 20 శాతంగా ఉంది, రాష్ట్రంలో సగటున 682.4 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 545.2 మిమీ వర్షపాతం నమోదైంది.


Similar News