అసోంలో భారీ వరదలు..6 లక్షల మందిపై ఎఫెక్ట్

అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.

Update: 2024-06-02 07:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగిందని, దీంతో అనేక ప్రాంతాల్లోని బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కొపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,01,642 మంది ప్రభావితం కాగా.. గత నెల 28 నుంచి వరదలు, తుపాను కారణంగా వివిధ ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.

నాగోన్ జిల్లా అత్యధికంగా ప్రభావితమైనట్టు తెలుస్తోంది. వివిధ జిల్లాల్లోని 40,000 మందికి పైగా నిరాశ్రయులు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్ట వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. అంతేగాక రోడ్డు, రైలు సేవలకు అంతరాయం తీవ్ర అంతరాయం కలుగుతోంది. న్యూ హాఫ్లాంగ్‌లోని చంద్రనాథ్‌పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్‌డింగ్ డివిజన్‌లోని సిల్చార్ స్టేషన్‌లో నీరు నిలిచిపోవడంతో సోమవారం వరకు సుమారు 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.


Similar News