Pakistan: బిన్ లాడెన్ ఇలాఖాలో టెర్రర్ క్యాంపు

పాకిస్థాన్‌ (Pakistan)లోని అబోటాబాద్ లో మెగా టెర్రర్‌ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Update: 2024-10-25 08:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ (Pakistan)లోని అబోటాబాద్ లో మెగా టెర్రర్‌ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాక్ కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతకొంతకాలంగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో టెర్రర్ క్యాంపు వెలుగులోకి రావడం గమనార్హం. నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్లు ఏకంగా పాక్‌ సైనిక స్థావరం పక్కనే మెగా టెర్రర్ క్యాంపుని ఏర్పాటు చేశాయి. అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఆ స్థావరంలోకి అడుగుపెట్టలేరు. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన జనరల్‌ దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ యువతకు ఆయుధలు వాడటం సహా ఉగ్రకార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారు.

బిన్ లాడెన్ ను హతమార్చింది ఇక్కడే..

గతంలో అబోటాబాద్‌లోని సేఫ్‌ హౌస్‌లోనే అల్‌ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు దాక్కొన్నాడు. 2011 మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్లలో ఇక్కడికి వచ్చి బిన్ లాడెన్‌ను హతమార్చింది. ఆ తర్వాత పాక్ ఆ నివాసాన్ని ధ్వంసం చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సిఉంది. టెర్రర్‌ చీఫ్‌లు హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌, సయ్యద్‌ సలాహుద్దీన్‌లు ఈ క్యాంప్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. ఇది పాకిస్థాన్‌లోనే అతిపెద్ద టెర్రర్‌ క్యాంప్‌గా ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. లష్కరే, జైషే, హిజ్బుల్‌ సంస్థలు ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.


Similar News