హత్రాస్ ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయని సీజేఐ బెంచ్ పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో: హత్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ ను ఆదేశించింది. హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం దారుణం అని పిటిషనర్ విశాల్ తివారీ అన్నారు. ఈ సమస్యపై సుప్రింకోర్టు దృష్టిపెట్టాలని పిటిషనర్ కోరగా.. సీజేఐ దీనిని తిరస్కరించారు. జులై 2న హత్రాస్ జిల్లాలో సత్సంగ్ ఏర్పాటు చేశారు. కాగా.. భోలే బాబా వెళ్తుండగా ఆయన పాదధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.