హత్రాస్‌లో ఘోర యాక్సిడెంట్.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గురువారం ఉదయం ఘోర యాక్సిడెంట్ చోటుచేసుకుంది.

Update: 2024-07-11 06:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గురువారం ఉదయం ఘోర యాక్సిడెంట్ చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 16 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్రాస్‌లోని టోలి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును మియాంగాంజ్ నుంచి చండీగఢ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే చనిపోయిన వారిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారాన్ని అందించారు. హత్రాస్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారిక ప్రకటన తెలిపింది. ఈ ఘటనపై హత్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వారిని కాపాడటానికి మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.


Similar News