Saurabh Bharadwaj: సీఎం కుర్చీలో ఎవరున్నా పర్వాలేదు.. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు
ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) కొత్త సీఎం గురించి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సీఎం కుర్చీలో ఎవరు ఉన్నా పర్వాలేదన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) కొత్త సీఎం గురించి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సీఎం కుర్చీలో ఎవరు ఉన్నా పర్వాలేదన్నారు. ఎందుకంటే ప్రజలు కేజ్రీవాల్ను సీఎంగా ఎన్నుకున్నారని, ఎప్పటికైనా ఆ కుర్చీ ఆయనదే అని మీడియాతో జరిగిన సమావేశంలో అన్నారు. “ఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని కేజ్రీవాల్ అన్నారు. అయితే గత ఎన్నిల్లో ప్రజల తీర్పు మేరకు ఈ ఐదేళ్లపాటు పదవి ఆయనకే చెందుతుంది. వచ్చే ఎన్నికలు జరిగే వరకు మాలో ఒకరు కుర్చీలో కూర్చుంటారు’’ అని సౌరభ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి రామాయణం గురించి ప్రస్తావించారు. రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో అదేవిధంగా మాలో ఒకరు దేశ రాజధానికి సీఎంగా ఉంటారని అని అన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు సీఎం కావాలనే ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరుని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు దిలీప్ పాండే ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. కాగా.. కేజ్రీవాల్ అతిశీ పేరుని ప్రతిపాదించినప్పుడు ఆప్ ఎమ్మెల్యేలందరూ నిలబడి ఆనిర్ణయానికి ఆమోదం తెలిపారు.