ITPO complex: ఐటీపీఓలో మోడీ పూజలు.. కార్మికులకు సన్మానం
జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఈ ఏడాది సెప్టెంబరులో వేదికగా నిలిచేందుకు రీ డెవలప్ చేసిన ఢిల్లీలోని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) కాంప్లెక్స్
న్యూఢిల్లీ : జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఈ ఏడాది సెప్టెంబరులో వేదికగా నిలిచేందుకు రీ డెవలప్ చేసిన ఢిల్లీలోని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) కాంప్లెక్స్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పూజల అనంతరం ఐటీపీఓను ప్రధాని మోడీ జాతికి అంకితమిచ్చారు. అనంతరం నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఐటీపీఓనే ప్రగతి మైదాన్ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. దేశంలోనే అతిపెద్ద సమావేశ సముదాయం ఇది.
ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణకు అందుబాటులో ఉన్న స్థలం విషయంలో ప్రపంచ స్థాయి టాప్-10 ఐఈసీసీల్లో ఇది కూడా ఒకటి. దీని మూడో అంతస్తులో ఏడు వేల మంది కూర్చునే వీలుంది. 3 వేల మంది కూర్చునేలా ఓ యాంఫీ థియేటర్ కూడా నిర్మించారు. 5500కుపైగా వెహికల్స్ను పార్క్ చేసుకోవచ్చు.